Nayudupeta: పెళ్లికి ముందు వధువు తండ్రి మృతి... విషయం చెప్పకుండా వేడుక నిర్వహణ!

  • నాయుడుపేటలో ఘటన
  • పెళ్లికి ముందు వధువు తండ్రికి అనారోగ్యం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి వివాహాన్ని ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో, అన్ని ఏర్పాట్లూ చేసుకుని, బంధుమిత్రులను పిలుచుకుని, పెళ్లికి గంటల ముందు తన ముచ్చటను తీర్చుకోకుండానే అనారోగ్యంతో ఓ తండ్రి మరణించిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది. తండ్రి మరణించిన విషయాన్ని కుమార్తెకు చెబితే, ఆమె వివాహానికి అంగీకరించదన్న కారణంతో, చెప్పకుండానే పెళ్లిని జరిపించారు.

వివరాల్లోకి వెళితే, పట్టణ పరిధిలోని వెల్ కమ్ కూడలిలో నివాసముంటూ ఫ్యాన్సీ దుకాణాన్ని నిర్వహిస్తున్న యస్దానీ బాషా, తన కుమార్తె సైరాబానుకు వివాహాన్ని నిశ్చయించారు. 22న వివాహం తలపెట్టి, ఆహ్వాన పత్రికలు పంచారు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొనివున్న వేళ, బాషా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో చెన్నైకి తీసుకెళ్లారు. వివాహానికి గంటల ముందు ఆయన కన్నుమూశారు.

దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు, తండ్రి లేడన్న విషయాన్ని సైరాబానుకు చెప్పకుండానే వేడుకను ముగించారు. పెళ్లి తరువాత ఆమెకు విషయం చెప్పగా, ఆమె గుండెలవిసేలా రోదించింది.

More Telugu News