Hyderabad: మరో ఊరికి పారిపోయిన వివాహిత యువతీ, యువకులు.. పట్టిచ్చిన కాల్ డేటా!

  • హైదరాబాద్ లో పని చేస్తున్న రవి, మంజుల
  • తన పిల్లలతో కలిసి రవితో కలసి వెళ్లిపోయిన మంజుల
  • చిత్తూరు జిల్లాకు వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు

తమ జీవిత భాగస్వాములను వదిలేసి, హైదరాబాద్ నుంచి పారిపోయి చిత్తూరు జిల్లాకు వచ్చిన యువతీ, యువకులను కాల్ డేటా పట్టించింది. కరబల కోట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ లో మేస్త్రీగా పనిచేస్తున్న రవి (35)కి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఓ భవంతిలో నిర్మాణ పనులు చేస్తున్న వేళ, కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన మంజుల (25) బేల్దారీ పనికి అక్కడికే వెళ్లింది. అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఆమె, రవి, ఒకరిని ఒకరు ఇష్టపడి, దగ్గరయ్యారు. హైదరాబాద్ ను విడిచి దూరంగా వెళ్లిపోయి, బతకాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తన పిల్లలను తీసుకుని రవితో కలిసి మంజుల, అంగళ్లు అనే గ్రామానికి వచ్చి, అద్దె ఇల్లు తీసుకుని, కలసి కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించారు. మంజుల, తన పిల్లలతో సహా అదృశ్యం కావడంపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. వారి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, అంగళ్లు గ్రామంలో ఉన్నారని గుర్తించి, అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసుల సాయంతో సహజీవనం చేస్తున్న జంటను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్ కు తరలించారు. కేసును విచారిస్తున్నామని, వారికి కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News