Tamilnadu: పామును మెడలో వేసుకుని నృత్యం చేస్తూ మహిళ పాలాభిషేకం!

  • తమిళనాడులోని వాలాజాబాద్ లో ఘటన
  • ఆలయానికి పేరు రావాలన్న ఉద్దేశంతో పిచ్చిపని
  • వీడియో వైరల్ గా మారడంతో అరెస్ట్

తాను నిర్వహిస్తున్న ఆలయానికి మరింత పేరు రావాలన్న ఉద్దేశంతో ఓ మహిళ చేసిన పని ఆమెను కటకటాల వెనక్కు నెట్టింది. ఈ ఘటన తమిళనాడులోని వాలాజాబాద్‌ అవెల్లేరి అమ్మ ఆలయంలో జరిగింది. ఈ ప్రాంతంలో వన భద్రకాళి అమ్మన్ ఆలయాన్ని నిర్వహిస్తున్న కపిల (39), భక్తులకు జోస్యం చెబుతూ ఉంటుంది. ఆమధ్య ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించింది. ఆ సమయంలో ఓ పామును తెచ్చి, కాసేపు అమ్మవారి మెడలో ఉంచి, ఆపై తానూ అమ్మ స్వరూపాన్నేనని చెబుతూ, దాన్ని తన శరీరంపై వేసుకుని నృత్యం చేస్తూ అమ్మవారికి పాలాభిషేకం చేసింది.

ఈ ఘటన తరువాత ఆలయం పేరు, కపిల పేరు మారుమోగడంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పాముతో ఆమె నాట్యం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవి చెంగల్పట్టు  జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వాలాజాబాద్ కు వచ్చి, విచారించారు. పామును ఎక్కడి నుంచి తెచ్చారని, ఎక్కడ పెట్టారన్న ప్రశ్నలకు కపిల నుంచి సమాధానాలు రాకపోవడంతో, వన్యప్రాణుల నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. ఆపై కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్ కు తరలించారు.

More Telugu News