Chiranjeevi: ఆదివారం నాటి ప్రకటన నకిలీది.. జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన ప్రకటనే అసలైనది!: చిరంజీవి స్పష్టీకరణ

  • శనివారం ప్రకటన మాత్రమే నాది
  • ఆదివారం నాటి ప్రకటన వాస్తవం కాదు
  • వివరణ ఇచ్చిన చిరంజీవి

తన పేరున ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రకటనను తాను విడుదల చేయలేదని, అది నకిలీదని టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఆ ప్రకటనను నమ్మవద్దని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను చిరంజీవి స్వాగతించడంతో ఆయనపై విమర్శల జడివాన మొదలైంది. దీంతో వెనక్కి తగ్గిన చిరంజీవి తాను అలాంటి ప్రకటన చేయలేదని చెబుతూ మరో ప్రకటన విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి.

‘‘నేనిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా. మూడు రాజధానుల అంశంపై సమర్థిస్తూ కానీ, వ్యతిరేకిస్తూ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు’’ అని చిరంజీవి పేర్కొన్నట్టు నిన్న సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొట్టింది. దీంతో మరోమారు స్పందించిన చిరంజీవి.. ఆ ప్రకటన అవాస్తవమని వివరణ ఇచ్చారు.

మూడు రాజధానులను సమర్థిస్తూ శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని, ఆదివారం తాను వెనక్కి తగ్గి మరో ప్రకటన విడుదల చేసినట్టుగా వస్తున్న ప్రచారంలో నిజం లేదని చిరంజీవి పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చిరంజీవి పునరుద్ఘాటించారు.

More Telugu News