Amaravahti: జగన్ ని, పార్టీని తిట్టించడమేంటంటూ చంద్రబాబుపై వైసీపీ నేత ఫైర్

  • రైతులు ఆందోళన చెందడం సహజమే
  • బాబు దానిని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారా?
  • సమాజంలో గందరగోళం సృష్టించాలనుకోవడం కరెక్టు కాదు

రాజధానికి భూములిచ్చిన రైతులు భయపడాల్సిన పని లేదని, వారికి న్యాయం జరుగుతుందని  వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందడం సహజమే కానీ, దాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న చంద్రబాబు, రైతులతో సీఎం జగన్ ని, వైసీపీని  తిట్టిండమేంటంటూ మండిపడ్డారు. సమాజంలో గందరగోళ పరిస్థితులు సృష్టించాలని చూడటం సబబు కాదని సూచించారు. రైతుల నిరసనల వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు.

రాజధాని కోసం తీసుకున్న భూములను చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు తక్కువ ధరకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన హయాంలో బాహుబలి సినిమాలో మాదిరి గ్రాఫిక్స్ చూపించారని, లక్ష కోట్లతో రాజధాని నిర్మించాలనడాన్ని ఎలా సమర్ధిస్తారని, ఇందుకు చంద్రబాబు అనుకూల మీడియా వంత పాడిందని విమర్శలు చేశారు. రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు అందరూ సమర్థించాలని కోరిన రామచంద్రయ్య, ఏపీని జగన్ అభివృద్ధి చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News