Karnataka: పిల్లల్ని చంపి...తానూ ఆత్మహత్య : భర్త వేధింపులతో మహిళ బలవన్మరణం

  • బాధ్యతలేని భర్తతో నిత్యం గొడవలు 
  • తానొక్కదాన్నే చనిపోతే పిల్లలు ఏమైపోతారో అని ఆందోళన 
  • అందుకే ఓ తల్లి తీవ్ర నిర్ణయం

నిత్యం భర్త వేధింపులు, తాను చనిపోతే పిల్లలు ఏమైపోతారో అన్న భయంతో ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. బాధ్యతలేని భర్తతో నిత్యం పోరాడేకంటే కాసేపు గుండెరాయి చేసుకునేందుకే సిద్ధమయ్యింది. పోలీసుల కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా మద్దూరు తాలూకా హాగలహళ్లి గ్రామానికి చెందిన సుందరేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు తేజస్వి, తరుణ్ పిల్లలు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా బాధ్యత మర్చి తిరుగుతుండడంతో సునీతకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు.

దీంతో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. శుక్రవారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్తతీరుతో విసిగిపోయిన సునీత ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకుంది. కానీ పిల్లలు ఇద్దరు చిన్నవారని, తాను చనిపోతే వారు దిక్కులేని వారు అయిపోతారన్న భయంతో వారిని కూడా చంపేయాలనుకుంది.

ఈ నిర్ణయానికి రాగానే నిన్న పిల్లలిద్దరి గొంతునులిమి చంపేసింది. అనంతరం ఉరివేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, సుందరేష్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందువల్లే సునీతను, పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడన్నది పోలీసుల అనుమానం. ఇదే ఆమె ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

More Telugu News