Gujarath: తన భార్యను లవ్ చేయాలని ఉద్యోగిని ప్రోత్సహించిన యజమాని... పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • వివాహేతర బంధాన్ని వదులుకోలేక పోయిన యువతి
  • ఇద్దరి మధ్యా నలిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన గుజరాత్ పోలీసులు, నరాలు తెగే ఉత్కంఠకు సమానమైన రియల్ క్రైమ్ స్టోరీని వెలుగులోకి తెచ్చారు. నమ్మలేని నిజాలను మీడియా ముందుంచారు. తన భార్యను లవ్ చేయాలని కింద పనిచేసే ఉద్యోగిని ప్రోత్సహించిన యజమానే ఈ ఘటనకు కారణమని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...

ఐదు నెలల క్రితం నిఖిల్ పర్మార్ అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి యజమానే కారణమని వెల్లడైంది. వాస్నా సమీపంలోని వెడ్డింగ్ డెకరేషన్ కంపెనీలో, గత సంవత్సరం నిఖిల్ ఉద్యోగంలో చేరాడు. ఆపై 10 నెలల తరువాత తాను ఉద్యోగం మానేస్తున్నానని తండ్రి అశోక్ కు చెప్పాడు. తన యజమాని, అతని భార్య వేధిస్తున్నారంటూ వాపోయాడు. జీతం తీసుకుని వస్తానని జూలై 14న ఆఫీసుకు వెళ్లిన నిఖిల్, ఆపై అతనితో కలిసి రాజస్థాన్ కు వెళుతున్నానని చెప్పాడు. ఆపై ఐదు రోజులకు నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందింది.

మూడు నెలల తరువాత నిఖిల్ తోబుట్టువులు సంజయ్, నిషలు సెల్ ఫోన్ ను పరిశీలిస్తుండగా, నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. తన యజమానికి నిఖిల్ పంపిన మెసేజ్ లు ఉన్నాయి. "మీ భార్యను ప్రేమించమని నాకు చెప్పారు. మీరు చెప్పినట్టే చేశాను. ఇప్పుడామె నన్నూ ప్రేమిస్తోంది. వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు మాట మార్చారు. మా రిలేషన్ షిప్ ను వదులుకోమని అంటున్నారు. బెదిరిస్తున్నారు. జీతం ఇవ్వడం లేదు. నన్ను మీ బానిసలా చూడొద్దు. నా మీద దయ చూపండి" అని వేడుకుంటున్న మెసేజ్‌ లు సెల్ ఫోన్ లో ఉన్నాయి.

వాటి ఆధారంగా కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులు, యజమాని భార్య అతనికన్నా 20 ఏళ్లు చిన్నదన్న విషయం పసిగట్టారు. అశోక్ పర్మార్ ప్రోత్సాహంతో ఆయన భార్యతో నిఖిల్ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. తనతో నిఖిల్ కు ఉన్న బంధం వెనుక భర్త ఉన్నాడని తెలుసుకున్న ఆమె తట్టుకోలేక, భర్తతో గొడవ పడింది. ఇక ఈ గొడవలు తనకు వద్దని భావించిన అశోక్, నిఖిల్ ను హెచ్చరించాడు. అశోక్ భార్య మాత్రం నిఖిల్ ను వదిలేందుకు ఇష్టపడకుండా, అతన్ని సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇద్దరి మధ్యా నలిగిపోయిన నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసును విచారించిన పోలీసులు, వారిద్దరిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

More Telugu News