Bihar: ఎన్నార్సీపై తమ వైఖరిని కుండబద్దలు కొట్టిన బీహార్ సీఎం

  • బీహార్ సహా అన్ని రాష్ట్రాల్లో ఎన్నార్సీ అమలు తథ్యమంటూ అమిత్ షా ప్రకటన
  • బీహార్ లో అమలు చేసేది లేదన్న నితీశ్ కుమార్
  • ఏమిటి ఈ ఎన్నార్సీ? అంటూ మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న

కేంద్రం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా వివాదాస్పదమవుతున్నాయి. ఎన్సార్సీ (జాతీయ పౌర పట్టిక), సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నార్సీపై స్పందించారు. ఎన్నార్సీ తమ రాష్ట్రంలో అమలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. "వాటీజ్ దిస్ ఎన్నార్సీ... మేం అమలు చేయబోవడంలేదు" అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు నితీశ్ సమాధానం చెప్పారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ మద్దతు పలికింది.

ఈ నేపథ్యంలో, ఎన్నార్సీపై ఆ పార్టీ వైఖరి ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, సీఎం నితీశ్ కుమార్ తన సమాధానంతో అందరికీ స్పష్టతనిచ్చారు. అంతకుముందు, బీహార్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నార్సీ అమలు చేయడం తథ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. కానీ, పశ్చిమబెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో దీని అమలుపై సందేహాలు కలుగుతున్నాయి.

More Telugu News