work tension: ఒత్తిడితో చిత్తవుతున్న ఉద్యోగులు...బీ(పీ) కేర్ ఫుల్ అంటున్న నిపుణులు!

  • పనిభారంతోపాటు పెరుగుతున్న రక్తపోటు 
  • పరిశోధనలో తేల్చిన లవాస్ వర్సిటీ అధ్యాపకులు 
  • వారానికి 50 గంటలు దాటి పనిచేస్తే ఇబ్బందే

ఉద్యోగం చేస్తున్నారా... వారానికి ఎన్ని పనిగంటలో గమనిస్తున్నారా? పని చేసుకుపోవడమే...అదేం పట్టించుకోవట్లేదండీ...అనుకుంటున్నారా. అయితే జర...జాగ్రత్త అంటున్నారు కెనడాలోని లవాల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. వారంలో మీరు యాభై గంటలకు మించి పనిచేస్తే ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టండని సూచిస్తున్నారు. ఎందుకంటే ఒత్తిడి కారణంగా రక్తపోటు చుట్టేస్తోందని, అధిక రక్తపోటు కారణంగా ప్రాణాలకే చిక్కు రావచ్చని చెబుతున్నారు.

ముఖ్యంగా మాస్క్ డ్ (పరీక్షలకు చిక్కని) రక్తపోటు సమస్య ఎక్కువగా ఉందని తేల్చారు. మాస్క్ డ్ రక్తపోటు సాధారణ పరీక్షల్లో కనిపించదు. కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించగలరు. పనిభారం ఎక్కువయ్యేకొద్దీ రక్తపోటు ముప్పు మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే... కెనడాలో 3500 మంది ఉద్యోగులపై ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు. వారానికి 35 గంటలు పనిచేసే వారి కంటే 50 గంటల కంటే అధిక సమయం పనిచేసే వారిలో 66 శాతం రక్తపోటు ముప్పు అధికంగా ఉన్నట్లు తేల్చారు.

49 గంటలకు మించి పనిచేసే వారిలో మాస్క్ డ్ రక్తపోటు ఎక్కువగా ఉందని వీరు గుర్తించారు. 41 నుంచి 48 గంటల మధ్య పనిచేసే వారిలో ముప్పు 54 శాతం వరకు ఉందని గుర్తించారు. అధిక రక్తపోటు బాధితులు హృదయ, రక్తనాళాల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తేల్చారు.

More Telugu News