Fishing net: మృత్యుపాశమైన వల... చేపల దొంగతనానికి వెళ్లిన వ్యక్తి కాళ్లకు చుట్టుకోవడంతో మృతి

  • నిజామాబాద్ జిల్లాలో విషాదం 
  • చెరువులో వేటాడేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు
  • అందులో ఒకరిని మింగేసిన వల

చెరువులో దొంగతనంగా చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరిలో ఓ వ్యక్తిని ఆ చెరువే మింగేసింది. వేటాడుతున్న సమయంలో కాళ్లకు వల చుట్టుకోవడంతో నీట మునిగి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.... నిజామాబాద్ మండలం ధర్మారం తండాలో ఓ చెరువు ఉంది. పుష్కలంగా చేపలున్న ఈ చెరువుపై భాస్కర్ (28), రవి అనే ఇద్దరు యువకుల దృష్టి పడింది. ఇద్దరూ మూడు రోజుల క్రితం మధ్యాహ్నం వేళ వేటకు వెళ్లారు. భాస్కర్ చెరువులోకి దిగి చేపల వేట చేస్తున్నాడు.

వల వేసేటప్పుడు జరిగిన పొరపాటు కారణంగా భాస్కర్ కాళ్లు వలకు చిక్కుకుని నీట మునిగిపోయాడు. దీన్ని గమనించి రవి భయంతో పారిపోయాడు. బయటకు వెళ్లిన భాస్కర్ రెండు రోజులైనా ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు రవిని నిలదీయడంతో అసలు ఘోరం వెలుగుచూసింది. అతను చెప్పిన మేరకు చెరువులో నిన్న వెతకగా మృతదేహం లభించింది.

More Telugu News