DMK: డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు సమన్లు జారీ.. జనవరి 7లోపు విచారణకు హాజరు కావాలని ఎస్సీ కమిషన్ ఆదేశం

  • దళితుల భూములను ఆక్రమించి పత్రిక కార్యాలయ నిర్మాణం
  • ఆరోపించిన పీఎకే చీఫ్ రాందాస్ 
  • ఏడో తేదీ లోపు దస్తావేజులతో రావాలంటూ స్టాలిన్‌కు సమన్లు

డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల ఏడో తేదీలోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కొడంబాక్కంలోని ‘మురసోలి’ పత్రిక కార్యాలయం సమీపంలోని పంచమి భూములను డీఎంకే ఆక్రమించుకుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. పంచమి భూములను డీఎంకే ఆక్రమించుకుందంటూ పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆరోపించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని బీజేపీ నేత శ్రీనివాసన్ జాతీయ ఎస్పీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దళితుల భూములైన వాటిని ఆక్రమించి పత్రిక కార్యాలయాన్ని కట్టారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ మరికొన్ని పార్టీలు కూడా డిమాండ్ చేయడంతో ఎస్సీ కమిషన్ స్పందించింది.

తమకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్ విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా మురసోలి ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయనిధి స్టాలిన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉదయనిధి తరపున ఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి హాజరై తమ వాదనను వినిపించారు. వాదనలు విన్న కమిషన్ విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు, ఆ లోపు స్టాలిన్ కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరయ్యే సమయంలో పత్రిక కార్యాలయం నిర్మించిన స్థలానికి సంబంధించిన అసలు డాక్యుమెంట్లు తీసుకురావాలని తన ఆదేశాలలో పేర్కొంది.

More Telugu News