Minister: మంత్రి బుగ్గన క్షమాపణలు చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తా: రావెల కిశోర్ బాబు

  • అమరావతిలో నాకు భూములు ఉన్నాయన్న ఆరోపణలు ఖండిస్తున్నా
  • ‘మైత్రి’తో నాకు సంబంధం లేదు
  • నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి తప్పుకుంటా

అమరావతిలో హెరిటేజ్ సంస్థకు, పలువురు టీడీపీ నాయకులకు భూములు ఉన్నాయంటూ ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపుతోంది. ఈ విషయమై ‘హెరిటేజ్ ఫుడ్స్’ ఇప్పటికే వివరణ ఇచ్చింది. తాజాగా, రావెల కిశోర్ బాబు స్పందించారు.

అమరావతిలో తనకు నలభై ఎకరాలు ఉన్నాయని చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు. మైత్రి సంస్థతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే మంత్రి బుగ్గన తన పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన బుగ్గన క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, పరిపాలన వేర్వేరు చోట్ల ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News