Ganta Srinivasa Rao: సీఎం జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నా: గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

  • సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం
  • అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా విశాఖ మారుతుంది
  • విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధం

రాష్ట్రానికి  మూడు రాజధానులు ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ నిన్న సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, చట్టసభల రాజధానిగా అమరావతి అంటూ ఆయన చేసిన ప్రకటనపై టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తుంటే, ఆ పార్టీ కీలక నేత గంటా శ్రీనివాసరావు మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు. సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమని తెలిపారు.

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చేసిన ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ లో ప్రకటించారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమని అన్నారు.

'రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీతో రాజధానిగా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు' అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

More Telugu News