Disha: దిశపై అత్యాచారానికి ముందు 9 మంది మహిళలపై నిందితుల హత్యాచారం.. వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు వెల్లడి!

  • ఆరుగురిని చంపిన ప్రధాన నిందితుడు ఆరిఫ్
  • ముగ్గురిని మట్టుబెట్టిన చెన్నకేశవులు
  • మొత్తం 15 ఘటనలను గుర్తించిన పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు విచారణలో వీరు ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వెల్లడించినట్టు సమాచారం. దిశపై అత్యాచారానికి తెగబడడానికి ముందు నిందితులు మరో 9 మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దిశ కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ ఆరుగురిని హత్య చేయగా, చెన్నకేశవులు ముగ్గురిని అంతమొందించినట్టు చెప్పారు.

ఈ ఘటనలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాలను దహనం చేసినట్టు నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్టు సమాచారం.

వారు చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 15 ఘటనలు జరిగినట్టు గుర్తించారు. దిశ నిందితుల డీఎన్ఏను మృతి చెందిన వారి డీఎన్ఏతో విశ్లేషిస్తున్నారు. నిందితులకు సంబంధించి కోర్టుకు సమర్పించనున్న చార్జిషీట్‌లో వారు వెల్లడించిన నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News