Jagan: జగన్ కు పాలించడం చేతకాదని ముందే చెప్పా: కన్నా లక్ష్మీనారాయణ

  • అధికార యంత్రాంగంపై కూడా పట్టు కోల్పోయారు
  • జగన్ తీరును వైసీపీ నేతలే తప్పుపడుతున్నారు
  • జగన్ తీరుతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారు

ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని... ఆయనకు పాలించడం చేత కాదని తాను ముందే చెప్పానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆరు నెలల కాలంలోనే అధికార యంత్రాంగంపై జగన్ పట్టు కోల్పోయారని చెప్పారు. జగన్ నియంతృత్వ ధోరణితో ముందుకు సాగుతున్నారని... ఆయన తీరును వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారని అన్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని జగన్ చెప్పడం సరికాదని చెప్పారు. మీరు ఢిల్లీకి వెళ్లినప్పుడే అమిత్ షాను కలవాలనుకోవడం సరికాదని అన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సూచనలను సీఎం వినడం లేదని మండిపడ్డారు.

మాకు ఇష్టం వచ్చిన రీతిలో పాలిస్తామనే ధోరణితో జగన్ వెళ్తున్నారని కన్నా విమర్శించారు. జగన్ తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ప్రజలు ఆస్తులను చంద్రబాబు తాకట్టు పెడితే... జగన్ అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంగ్లీష్ మీడియంను కేవలం ఒక ఆప్షన్ గా మాత్రమే పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.

More Telugu News