Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం!

  • ఈ నెల 13న ఘటన 
  • బాలిక ఆడుకుంటుండగా తీసుకెళ్లి అత్యాచారం
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ, బండ్లగూడకు చెందిన ఓ వ్యక్తి అలీనగర్‌లోని రంగుల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 13న పరిశ్రమకు వెళ్తూ తన 11 ఏళ్ల కుమార్తెను వెంట తీసుకెళ్లాడు. అతడు డ్యూటీలో నిమగ్నమవగా, బాలిక ఆడుకుంటోంది.

చిన్నారి ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు ఆమెను సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలిక మూడు రోజుల వరకు ఈ దారుణాన్ని బయటకు చెప్పలేకపోయింది. చివరికి గతరాత్రి జరిగిన విషయాన్ని తండ్రికి ఏడుస్తూ చెప్పడంతో షాకైన అతడు వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన ప్రదేశం మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మైలార్‌దేవుపల్లి స్టేషన్‌కు పంపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News