Chandrababu: చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా మూడు రాజధానుల విషయం చెప్పిన అచ్చెన్నాయుడు

  • మూడు రాజధానులు ఉంటాయన్న జగన్!
  • చంద్రబాబుకు జగన్ వ్యాఖ్యల సమాచారం అందించిన అచ్చెన్న
  • తుగ్లక్ పాలన అంటే ఇదేనన్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి అంశంపై ఆయన ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓ ఎమ్మెల్యే జిల్లాకో ఆఫీసు పెడతామని చెబుతున్నాడని, హైకోర్టుకు వెళ్లాలంటే ఓ ప్రాంతానికి వెళ్లాలని, సచివాలయానికి వెళ్లాలంటే ఇంకో ప్రాంతానికి వెళ్లాలని, ప్రజలు ప్రతి పనికీ జిల్లాల వారీగా తిరగాలని వీళ్ల ఉద్దేశం కాబోలు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీనిపై మాట్లాడుతుండగా, ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు ఆయనకు వివరించారు.

"ఇప్పుడే అసెంబ్లీలో అనౌన్స్ చేశారట. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషయల్, లెజిస్లేటివ్ అంటూ మూడు నగరాలను రాజధానులుగా ప్రకటిస్తారట. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్... ఇలా ఏర్పాటు చేస్తారట" అంటూ అచ్చెన్నాయుడు అధినేత చంద్రబాబుకు తెలిపారు.

దాంతో చంద్రబాబు మరింత తీవ్రతతో మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టిస్తారని వ్యాఖ్యానించారు. అందుకే తుగ్లక్ పాలన అంటున్నామని, పిచ్చి తుగ్లక్ పాలన ఇలాగే ఉంటుందని, ఎవరైనా హైకోర్టుకు వెళ్లాలంటే మరోచోటికి వెళ్లి, అక్కడినుంచి అసెంబ్లీలో పనులు చూసుకోవాలంటే మరోప్రాంతానికి వెళ్లాలని విమర్శించారు.

విశాఖలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెడతానంటాడని, ఏమిటీ పాలన అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తే ఎందుకు క్యాన్సిల్ చేశాడని ప్రశ్నించారు. ఇన్ని రాజధానులు ఏర్పాటు చేసి రేపు ముఖ్యమంత్రి ఏ రాజధానిలో కూర్చుంటాడని ప్రశ్నించారు. ఇవాళ మూడు రాజధానులన్న సీఎం జగన్ రేపు ఏం చెబుతాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

More Telugu News