Kamal Haasan: కేంద్రం ఆడమన్నట్లు ఏఐఏడీఎంకే ఆడుతోంది: కమలహాసన్

  • పౌరసత్వ సవరణ చట్టంపై ఏఐఏడీఎంకేపై విమర్శ
  • మా పార్టీ ఎన్ఆర్సీని కూడా వ్యతిరేకిస్తోంది
  • జాతీయ పౌరసత్వ నమోదు చట్టం సవరణపై సుప్రీం కోర్టుకు వెళతాం

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ప్రభుత్వాల వైఖరులను ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యుమ్(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ విమర్శించారు. తమ పార్టీ ఈ సవరణ చట్టం సహా, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ను కూడా వ్యతిరేకిస్తోందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి  పార్లమెంటులో ఏఐఏడీఎంకే మద్దతు తెలిపి ఇటు తమిళులను, అటు దేశాన్ని మోసం చేసిందన్నారు.

ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడుతోందని ఎద్దేవా చేశారు. కమలహాసన్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జాతీయ పౌరసత్వ నమోదు చట్టం సవరణపై తమ పార్టీ సుప్రీంకోర్టుకు వెళుతుందని చెప్పిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్ఆర్సీ పై కూడా మీ పార్టీ ఇదే వైఖరి అవలంబిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు కమల్ జవాబిస్తూ.. 'అవును' అని చెప్పారు. ‘ఎప్పుడైతే ఆ ఎన్ఆర్సీ జాతీయ స్థాయిలో అమలు చేయటం ప్రారంభమవుతుందో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. మేము మైదానంలోకి దిగుతాము. ఎంతదూరమైనా ముందుకు సాగుతాము’ అన్నారు.

More Telugu News