Kamal Haasan: యువకుల ప్రశ్నించే ధోరణిని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్యం ఐసీయూకి చేరినట్లే: కమలహాసన్

  • యువకులకు రాజకీయ అంశాలపై అవగాహన ఏర్పడుతోంది
  • పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశ్నించడంలో తప్పులేదన్న కమల్
  • పౌరసత్వ సవరణ చట్టం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదు

యువకులకు రాజకీయ అంశాలపై అవగాహన ఏర్పడుతోందని.. వారు పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశ్నించడంలో తప్పులేదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యుమ్(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఐసీయూకి చేరిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘విద్యార్థులు రాజకీయాలను అర్ధం చేసుకుని ప్రశ్నించాల్సిన అవసరముంది. మన జీవితాలను ఎంతో ప్రభావితం చేసే రాజకీయాలు అన్నిచోట్లా ఉంటాయి. యువకులు రాజకీయపరమైన అంశాలపై అవగాహన కలిగివుండి  ప్రశ్నించడం తప్పుకాదు. వారి ప్రశ్నల్ని అణచివేయాలని చూస్తే మాత్రం ప్రజాస్వామ్యం ఐసీయూకి చేరినట్లే. పౌరసత్వ సవరణ చట్టం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇది దేశ వ్యాప్తంగా చర్చించాల్సిన అంశం’ అని కమల్ అన్నారు.

More Telugu News