Uttar Pradesh: ఈవ్ టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయబోతే.. అర్ధనగ్నంగా మార్చిన దుండగులు

  • యూపీలోని చౌరీచౌరా ప్రాంతంలో ఘటన
  • నిందితులను అరెస్టు చేసిన యూపీ పోలీసులు  
  • పోస్కో, లైంగిక వేధింపులు చట్టాల కింద కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ లో ఈవ్ టీజింగ్ కు గురైన ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళుతుండగా మార్గమధ్యంలో దుండగులు అడ్డుకుని సదరు బాలిక దుస్తులు చించివేసి అర్ధనగ్నంగా మార్చి దాడికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు వివరాలను   పోలీసులు మీడియాకు వెల్లడించారు. గోరఖ్ పూర్ జిల్లా చౌరీచౌరా ప్రాంంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుందన్నారు. 17ఏళ్ల బాలిక తనను ఈవ్ టీజింగ్ చేశారని తన వదిన తండ్రితో కలిసి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళుతున్న క్రమంలో ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డ గౌతమ్, ముఖేష్ అనే ఇద్దరు సోదరులు దాడి చేసి బాలిక దుస్తులు చింపివేసి, అడ్డువచ్చిన బాలిక తండ్రిపై చేయిచేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

కొంతకాలంగా ఆ ఇద్దరు వ్యక్తులు బాలికను అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేసేవారని బాధితురాలు తమకు గతంలో తెలిపిందన్నారు. దీనిపై తాము నిందితులను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. వారు తిరిగి ఈవ్ టీజింగ్ కు పాల్పడటంతో బాలిక నిందితులపై ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకుందని.. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజే నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు సీఐ రచనా మిశ్రా తెలిపారు. వారిపై పోస్కో, లైంగిక వేధింపులు, హాని కలిగించడం, నిర్బంధించడం, ఆయుధాలతో దాడి చేయడం తదితర నేరాల కింద కేసు నమోదు చేశామన్నారు.

More Telugu News