Aishwarya Rai: ఆ ఆరోపణలు అబద్ధం.. కోడలే నన్ను వేధిస్తోంది: బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన లాలు అనుచరుడు శక్తియాదవ్
  • ‘మేడంను ఐశ్వర్యనే వేధించింది’ అంటూ ఫిర్యాదు
  • ఆరోపణలు కొట్టిపడేసిన ఐశ్వర్య తండ్రి

కోడల్ని కొట్టి, ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ వస్తున్న ఆరోపణలపై బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి స్పందించారు. కోడలు ఐశ్వర్యనే తనను వేధిస్తోందంటూ రబ్రీదేవి తన అనుచరుడితో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో అత్తాకోడళ్ల పోరు బీహార్‌లో చర్చనీయాంశమైంది. రబ్రీదేవి తనను జుట్టు పట్టుకుని ఈడ్చేసిందని, బాడీగార్డులతో కలిసి ఇంటి నుంచి గెంటేసిందని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, భర్త  తేజ్ ప్రతాప్ యాదవ్, ఆడపడుచు మిసాభారతిలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

ఐశ్వర్యరాయ్ ఫిర్యాదుకు ప్రతిగా తమ అనుచరుడైన శక్తియాదవ్‌తో రబ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ‘మా మేడం రబ్రీదేవిని కోడలు ఐశ్వర్యనే వేధిస్తోంది’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శక్తియాదవ్ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై ఐశ్వర్య తండ్రి చంద్రికారాయ్ స్పందించారు. ఆ ఆరోపణల్లో పసలేదని కొట్టిపడేశారు.

More Telugu News