Hyderabad: నెల రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి, కనిపించకుండా పోయిన కుటుంబం!

  • గత నెల 11న శ్రీశైలం వెళ్లిన శ్రీధర్‌రెడ్డి కుటుంబం
  • చివరిసారి ఈ నెల 5న కుటుంబ సభ్యులకు ఫోన్
  • ఆ తర్వాతి నుంచి ఆచూకీ గల్లంతు

శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ కుటుంబం ఆచూకీ గల్లంతైంది. నెలరోజులుగా వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, హయత్‌నగర్‌లోని శాంతినగర్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి (34), ప్రశాంతి (28) భార్యాభర్తలు. వీరికి 15 నెలల బాబు విహాన్‌రెడ్డి ఉన్నాడు. పుట్టిన రోజు సందర్భంగా గత నెల 11న శ్రీధర్‌రెడ్డి దంపతులు కుమారుడిని తీసుకుని శ్రీశైలం వెళ్లారు.

శ్రీశైలం వెళ్లిన వారు మూడు రోజుల వరకు హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నారు. చివరిసారి ఈ నెల 5న తల్లి జయమ్మకు ఫోన్ చేసిన శ్రీధర్‌రెడ్డి తాము శ్రీశైలంలోనే ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో తల్లి జయమ్మ ఆందోళన చెందింది. వారి ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News