Sonia Gandhi: దమ్ముంటే ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలి: అమిత్ షాకు సోనియా సవాల్

  • పౌరసత్వ చట్టానికి సవరణ చేసిన కేంద్రం
  • మండిపడుతున్న ప్రజానీకం
  • ఘాటుగా స్పందించిన సోనియా గాంధీ

పౌరసత్వ చట్టం దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు దమ్ముంటే ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లిరావాలని సవాల్ విసిరారు.

 "కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అసోం, మేఘాలయా, త్రిపుర భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అమిత్ షా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ధైర్యం చేయగలరా? పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే మొదట బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి భారత పర్యటన రద్దు చేసుకున్నారు. ఆపై జపాన్ ప్రధాని కూడా పర్యటన విరమించుకున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

"మోదీ ప్రభుత్వం ఉద్దేశాలు సుస్పష్టం. దేశంలో అనిశ్చితి సృష్టించడం, హింసను వ్యాప్తిచేయడం, దేశంలోని యువత హక్కులను లాగేసుకోవడం. దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు వ్యాపింపచేసి దాన్నుంచి రాజకీయ లబ్ది పొందడం. వీటన్నింటికీ కర్త, కర్మ, క్రియ ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమిత్ షా" అంటూ నిప్పులు చెరిగారు.

More Telugu News