jharkhand: ఝార్ఖండ్‌లో ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు!

  • 15 స్థానాలకు ప్రారంభమైన పోలింగ్ 
  • బరిలో 221 మంది అభ్యర్థులు
  • ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులుగా ఇద్దరు మహిళలు

ఝార్ఖండ్ అసెంబ్లీకి ఐదు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 15 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 221 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47,85,009 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇక బరిలో ఉన్న వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. బొకారో స్థానం నుంచి అత్యధికంగా 25 మంది పోటీ పడుతున్నారు. ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జమువా, బోగడర్, గిరిధ్, దుమ్రి, తుండి తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి రాజ్ పలివార్, రెవెన్యూశాఖ మంత్రి అమర్ కుమార్ బౌరీలు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జరియా నియోజకవర్గం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు బరిలో నిలవడం విశేషం. నీరజ్ సింగ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజీవ్‌సింగ్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన భార్య రజని ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగగా, హత్యకు గురైన నీరజ్‌సింగ్ భార్య పూర్ణిమ ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. కాగా, చివరి విడత ఎన్నికలు ఈ నెల 20న జరగనుండగా, 23న ఫలితాలు వెలువడనున్నాయి.

More Telugu News