Andhra Pradesh: మా అంబటి రాంబాబు అన్న చెప్పినట్టు వీళ్ల కుక్కతోక బాగా వంకర... కర్ర కట్టినా విరిగిపోతుంది: మంత్రి అనిల్ కుమార్

  • టీడీపీ నేతలపై వైసీపీ మంత్రి వ్యాఖ్యలు
  • వీళ్లకు అవినీతి అంటే అర్థం తెలుసా అంటూ అనిల్ ఆగ్రహం
  • కళ్లులేని కబోదులు, పనికిమాలిన వెధవలు అంటూ విమర్శలు

టీడీపీ నేతలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. టీడీపీ నేతలకు మతి భ్రమించిందేమో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. అన్ని టెండర్లు పారదర్శకంగానే జరిగాయని, టీడీపీ నేతలకు అవినీతి అంటే అర్థం తెలుసా అంటూ ప్రశ్నించారు. పనిపాటా లేని వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని అనేక పనుల్లో ధనం ఆదా చేయగలిగామని చెప్పారు.

ఆల్తూరుపాడు, కోవూరు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల్లో అధికారులు ఎవరినైనా బెదిరించారా, లేక ఎవరినైనా అనర్హులుగా ప్రకటించారా అని ప్రశ్నించారు. ఇంతకంటే పారదర్శకంగా ఎక్కడైనా టెండర్లు నిర్వహిస్తున్నారేమో చూపించాలని సవాల్ విసిరారు. కళ్లు లేని కబోదులు, పనికిమాలిన వెధవలు చేసే ఆరోపణలను కూడా పట్టించుకోం అంటూ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. నోరుంది కదా అని మాట్లాడేస్తే సరిపోదని అన్నారు. వీళ్లు కుక్కతోక వంకర తరహా వ్యక్తులు, అంబటి రాంబాబు అన్న చెప్పినట్టు వీళ్ల తోకలకు కర్ర కట్టినా విరిగిపోతుంది అంటూ విమర్శలు చేశారు.

More Telugu News