RGV: రామ్ గోపాల్ వర్మపై నిప్పులు చెరిగిన కేఏ పాల్

  • వర్మపై విమర్శలు గుప్పించిన కేఏ పాల్
  • వర్మను అందరూ వెలివేశారంటూ వ్యాఖ్యలు
  • తనకు క్షమాపణ చెబితేనే వర్మకు మళ్లీ సక్సెస్ అన్న పాల్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్మను కుటుంబం ఎప్పుడో వెలివేసిందని, ప్రజలు సైతం బహిష్కరించారని తెలిపారు. ముంబయిలోనూ సినిమాల్లేక, ఆంధ్రాలోనూ సినిమాల్లేక ఎవరో డబ్బులు ఇస్తే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా చేశాడని ఆరోపించారు. ఇలాంటి పిచ్చి సినిమాలు చేయడం ఆపేయాలని వర్మకు హితవు పలికారు.

ఈ సినిమా ద్వారా కులాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశాడని, ఈ సినిమాలో తన సీన్లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే దైవ ప్రార్థనలు, చట్టం సహకారంతో ఆ సీన్లను లేకుండా చేశామని అన్నారు. ఇప్పుడా సినిమా ఫ్లాప్ కావడంతో గర్వం తగ్గిందని, ముఖం చూపించుకోలేకపోతున్నాడని విమర్శించారు. తన ఫొటో మార్ఫింగ్ చేయడంపై స్పందిస్తూ, సత్యమే విజయం సాధించిందని తెలిపారు. ఇలాంటి చవకబారు ప్రచారం మానుకుని తనకు, దేవుడికి, ప్రజలకు వర్మ క్షమాపణలు చెప్పాలని, అప్పుడే మళ్లీ సక్సెస్ అవుతాడని కేఏ పాల్ పేర్కొన్నారు. లేకపోతే వర్మ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం తథ్యమని వ్యాఖ్యానించారు.

More Telugu News