Nara Lokesh: దిశ బిల్లును ప్రవేశపెట్టిన రోజే గుంటూరులో ఘోరం జరిగింది: నారా లోకేశ్

  • ఐదేళ్ల బాలికపై లక్ష్మణ్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు
  • 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా జగన్ చర్యలు తీసుకోవాలి
  • మహిళలకు భరోసా కల్పించాలి

దిశ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించిన రోజే గుంటూరులో మరో దారుణం వెలుగు చూసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల బాలికపై లక్ష్మణ్ రెడ్డి అనే దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. చట్టాలు పదునెక్కుతున్నా... దారుణాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని లోకేశ్ అన్నారు. ఐదేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన లక్ష్మణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం ప్రకారం నిందితుడికి 21 రోజుల్లోనే శిక్షపడేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, మహిళలకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.

More Telugu News