Andhra Pradesh: రూ.5 లక్షలు ఇవ్వాలంటూ వ్యాపారి కుమారుడికి కానిస్టేబుల్ బెదిరింపులు.. అరెస్ట్

  • డబ్బులు ఇవ్వకుంటే యాసిడ్ పోస్తానని, చంపేస్తానని బెదిరింపు
  • పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పిన బాధితుడు
  • ఆటకట్టించిన మంగళగిరి పోలీసులు

రూ. 5 లక్షలు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తానని, యాసిడ్ పోస్తానని వ్యాపారి కుమారుడిని బెదిరించిన కానిస్టేబుల్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. ప్రస్తుతం గుంటూరు లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో గోవింద్ కానిస్టేబుల్. గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేశాడు. ఆ సమయంలో గోవింద్.. పార్క్‌ రోడ్డులోని సాధు సోడా సెంటర్ నిర్వాహకుడు మునాఫ్ ఇంటి పక్కన ఉండేవాడు. ఈ క్రమంలో వారితో సాన్నిహిత్యం పెరిగింది.

గోవింద్ గత కొన్ని రోజులుగా మునాఫ్ కుమారుడు బాషాను రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకోసం ఇద్దరు ఆటో డ్రైవర్లను వాడుకున్నాడు. వారి సెల్‌ఫోన్ల నుంచి బాషాకు బెదిరింపు మెసేజ్‌లు పంపేవాడు. తాజాగా, మరోమారు మెసేజ్ చేసిన గోవింద్.. రూ. 5 లక్షలు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను హతమారుస్తానని, యాసిడ్ పోస్తానని అందులో పేర్కొన్నాడు. అది చూసి భయపడిన బాషా పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పాడు.

స్పందించిన పోలీసులు బాషా మొబైల్ నుంచి గోవింద్‌కు మెసేజ్ చేయించారు. రూ. 5 లక్షలు అంటే కష్టమని, రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వగలనని అందులో పేర్కొన్నాడు. మెసేజ్ చూసి నిజమేనని నమ్మిన నిందితుడు గోవింద్ డబ్బులు పెట్టిన బ్యాగ్‌ను నిడమర్రు రైల్వేగేటు వద్ద ఉన్న ఓ దుకాణం పేరు చెప్పి అందులో పెట్టి వెళ్లిపోవాలని తిరిగి మెసేజ్ చేశాడు.

దీంతో బాషా అతడు చెప్పినట్టే నగదు ఉన్న బ్యాగును ఆ దుకాణంలో పెట్టి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే నగదు బ్యాగును తీసుకునేందుకు నిందితులు గోవింద్, ఇద్దరు ఆటోడ్రైవర్లు అక్కడికి వచ్చారు. అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News