Nirbhaya: నిర్భయ దోషులు నలుగురికీ ఒకేసారి ఉరి... తాళ్లకు వెన్నపూస పూయాలని అధికారుల నిర్ణయం!

  • నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు
  • తక్కువ నొప్పితో ప్రాణాలు పోయేందుకు చర్యలు
  • ఉరికొయ్యలను పరిశీలించిన అధికారులు

2012 డిసెంబర్ నాటి నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లకు విధించిన మరణదండనను అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని ఉరి తీసేందుకు మీరట్ జైల్లో ఉన్న తలారిని రప్పించిన అధికారులు, జైలులోని ఫాన్సీ కోట బ్యారక్ లో 1950లో ఏర్పాటు చేసిన ఉరి కొయ్యలను పరిశీలించారు. ఉరికొయ్యగా ఉన్న మెటల్ బార్, నలుగురు దోషుల బరువును మోస్తుందా? అని పరిశీలించారు. మరో మెటల్ క్రాస్ బార్ ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.

నలుగురికీ ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయాలని భావిస్తున్న జైలు అధికారులు, బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి 8 మనీలా ఉరితాళ్లను తెప్పిస్తున్నారు. ఇవి మృదువుగా, బలంగా ఉండేలా చూడటంతో పాటు దోషులు తక్కువ బాధతో ప్రాణాలు విడిచేందుకు వీలుగా తాళ్లకు వెన్నపూస రాయాలని నిర్ణయించారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకూ ఒకసారి దోషులు తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తున్నామని తెలిపిన అధికారులు, వారు నిత్యమూ న్యాయవాదులను కలుస్తూ, తమ కేసు పురోగతిని తెలుసుకుంటున్నారని, వారి ప్రవర్తనలో తాము ఎటువంటి మార్పునూ గమనించలేదని స్పష్టం చేశారు.

More Telugu News