Kakinada: వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది: పవన్ కల్యాణ్

  • వైసీపీ పాలన కూల్చివేతలతో మొదలుపెట్టింది
  • భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చేసింది
  • ఈరోజు రైతులను కూల్చేస్తోంది

తాను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు..సిమెంట్ ఫ్యాక్టరీలూ పెట్టలేదు, కాంట్రాక్టులు చేయనంటూ అధికార పక్ష నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడమేనని, ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమాలను ఆదరించారని, నచ్చకపోతే పక్కనబెట్టారని చెప్పారు. అందరికీ సెలవులుంటాయి కానీ రైతుకు మాత్రం ఉండవని అంటూ సీఎం జగన్ గురించి ప్రస్తావించారు.

‘మన జగన్ రెడ్డి గారికి శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యేలకు సెలవులుంటాయి కానీ రైతుకు సెలవు లేదు’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ పాలనను కూల్చివేతలతో ప్రారంభించిందని, భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చివేసిందని, ఈరోజు రైతులను కూల్చేస్తోందని, ఇంతమందిని కూల్చేస్తున్న ఈ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని భావోద్వేగ ప్రసంగం చేశారు.

More Telugu News