Telugudesam: మీడియాపై ఆంక్షలు వద్దు.. గవర్నర్ కు చంద్రబాబు వినతి

  • జీవో 2430 రద్దు చేయాలని గవర్నర్ ను కోరిన టీడీపీ అధినేత
  • కొన్ని ఛానళ్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఫిర్యాదు
  • ఇదే విషయమై అసెంబ్లీలో స్పీకర్ కు కూడా చంద్రబాబు విన్నపం

ఆంధ్రప్రదేశ్ లో మీడియాపై ఆంక్షలు విధించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని, జీవో 2430 రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు వినతి పత్రం ఇచ్చారు. గవర్నర్ ను కలిసిన వారిలో చంద్రబాబునాయుడితో పాటు మాజీ మంత్రి నారా లోకేశ్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 ఛానళ్ల రిపోర్టర్లను ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని గవర్నర్ కు వారు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ రోజు ఇదే విషయాన్ని చంద్రబాబు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మీడియాపై ఆంక్షలు వద్దంటూ.. జీవో 2430ను రద్దుచేయాలని స్పీకర్ ను కోరారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

More Telugu News