Chandrababu: గడ్డిపరక గర్జించినంత మాత్రాన సింహం కాదు: రోజా

  • మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు
  • ఆయన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి
  • సభలో చంద్రబాబు గట్టిగట్టిగా అరుస్తున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడుతున్న కొద్దీ చాదస్తం ఎక్కువవుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తొలి సారి ఎమ్మెల్యే అయిన తనను నిబంధనలకు విరుద్ధంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నుంచి తాను మధ్యంతర ఉత్తర్వులను తెచ్చుకున్నప్పటికీ... సభలో అడుగుపెట్టకుండా తనను మార్షల్స్ అడ్డుకున్నారని చెప్పారు.

గతంలో నిండు సభలో మీ అందరినీ పాతిపెడతానని బోండా ఉమ అన్నారని... అప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లారని రోజా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పనులు చేస్తుంటే... వ్యతిరేకించడమే పనిగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'మగధీర' సినిమా డైలాగ్ తరహాలో... 150 మందీ ఒకేసారి రండి, సమాధానం చెబుతానని చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని అన్నారు. సభలో చంద్రబాబు గట్టిగట్టిగా అరుస్తున్నారని... గడ్డిపరక గర్జించినంత మాత్రాన సింహం కాదని చెప్పారు.

More Telugu News