Supreme Court: ముగిసిన వాదనలు... 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ విచారణ
  • హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు  
  • విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా నివేదిక 

'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులతోనూ ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపినప్పటికీ, దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనని భావించిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ విశ్వసనీయతకు సంబంధించిన అంశమని తెలిపింది.

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఈ జ్యుడీషియల్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపింది. హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు చేయాలని సూచించింది. ఎన్ కౌంటర్ పై విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ కమిటీలో జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ తో పాటు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు.

More Telugu News