Ramgopal varma: నా సినిమాను ఆపడానికి ప్రయత్నించిన వారిపై కేసులు పెడుతున్నా: రాంగోపాల్‌వర్మ

  • నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి పేర్లు బయటపెడతా
  • అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటా
  • చైనా నుంచి వీడియో కాల్‌లో రాంగోపాల్ వర్మ

తన సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, అందరినీ కోర్టుకు ఈడుస్తానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ హెచ్చరించారు. ఆయన తాజా సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు  U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రస్తుతం చైనాలో ‘ఎంటర్‌ ది గాళ్‌ డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా వున్న వర్మ నిన్న రాత్రి వీడియో కాల్‌ ద్వారా హైదరాబాద్‌లోని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తన సినిమాను ఆపేందుకు ప్రయత్నించిన వారిపై త్వరలోనే కేసులు పెట్టబోతున్నట్టు పేర్కొన్నారు. ఫైనల్‌గా తన సినిమా రిలీజ్ అవుతోందని అన్నారు. తన సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి పేర్లను త్వరలో బయటపెడతానని అన్నారు.

కాగా, వర్మ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు టి.అంజయ్య మాట్లాడుతూ.. తమ సినిమాలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ కించపరచలేదని స్పష్టం చేశారు. సెన్సార్‌తో ఇబ్బందులు ఎదురైనా హైకోర్టు ఆదేశాలతో సర్టిఫికెట్ తెచ్చుకున్నట్టు తెలిపారు.  

More Telugu News