Andhra Pradesh: 'ఏపీ దిశ యాక్ట్'కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం.. అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే!

  • మహిళలకు అండగా ఉండేందుకు నిర్ణయం
  • ఏపీ క్రిమినల్ లా 2019 సవరణ బిల్లుకు ఆమోదం
  • మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించాలి 

ఏపీలో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీ క్రిమినల్ లా చట్టం 2019 సవరణ బిల్లుకు మంత్రి వర్గం అనుమతి తెలిపింది. ఈ సవరించిన చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. అత్యాచార ఘటనకు సంబంధించి నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు వారం రోజుల్లోగా దర్యాప్తు,14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ ఈ బిల్లును తయారుచేశారు. దీనికి 'ఏపీ దిశ యాక్ట్'గా పేరు నిర్ణయించారు. 

మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్ట్ లు చేస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు చేపట్టనున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే వారు, ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

More Telugu News