Rangasthalam: 'రంగస్థలం' అవార్డును ఇటీవల మరణించిన అభిమానికి అంకితం ఇచ్చిన రామ్ చరణ్

  • ఇటీవల కన్నుమూసిన నూర్ మహ్మద్
  • నూర్ మెగా ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు
  • నూర్ మృతికి చిరంజీవి సంతాపం

హైదరాబాద్ లో ఇటీవల నూర్ మహ్మద్ అనే మెగా ఫ్యామిలీ వీరాభిమాని కన్నుమూశాడు. నూర్ గత కొన్ని దశాబ్దాలుగా చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలను విపరీతంగా అభిమానించేవాడు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు. నూర్ మరణంతో చిరంజీవి సైతం చలించిపోయారు. అభిమాని నివాసానికి వచ్చి, నివాళులర్పించారు.

ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ సైతం నూర్ మృతికి కదిలిపోయారు. రంగస్థలం చిత్రంలో నటనకు గాను 'బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్' పురస్కారం లభించగా, ఆ అవార్డును ఇటీవల మరణించిన నూర్ కు అంకింతం ఇస్తున్నట్టు తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చరణ్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూర్ గొప్ప వ్యక్తి అని, తనను, తన తండ్రిని ఎంతో అభిమానిస్తూ, ప్రోత్సహించేవారని కీర్తించారు. ఆయన ఇప్పుడు మనమధ్యలేరని, తనకు అవార్డు నూర్ ఇచ్చినట్టే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మేం మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాం సర్... మిమ్మల్ని మిస్సవుతున్నాం అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

More Telugu News