Chandrababu: హెరిటేజ్ ఫ్రెష్ పై జగన్ కు చంద్రబాబు సవాల్

  • హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదని నిన్ననే చెప్పాను
  • సభ్యత లేకుండా మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు
  • హెరిటేజ్ ఫ్రెష్ మాది అని నిరూపించండి

ఉల్లిపాయ ధరలపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ వేడి పుట్టించింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ. 200కు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ మరోసారి వ్యాఖ్యానించారు. ఉల్లిని తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోందని... అందుకే రైతు బజార్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం కొత్త కాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు.

హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని పలు మార్లు చెప్పినా... అవే మాటలు మాట్లాడటం సరికాదని చంద్రబాబు అన్నారు. దీని గురించి నిన్ననే తాను క్లియర్ గా చెప్పానని... అయినా, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు సవాల్ విసురుతున్నానని... హెరిటేజ్ ఫ్రెష్ తమదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. భారతి సిమెంట్స్, సోలార్ విండ్ పవర్ మాదిరి మీలా తాము మోసాలు చేయలేదని అన్నారు.

More Telugu News