Lok Sabha: పౌరసత్వ బిల్లుకు లోక్‌సభలో అర్ధరాత్రి ఆమోదం!

  • బిల్లుకు అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు
  • ఏడు గంటలపాటు సుదీర్ఘ చర్చ
  • అనుకూలంగా ఓటేసిన టీడీపీ, వైసీపీ

భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలన్న కీలక బిల్లుకు గత అర్ధరాత్రి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఏడు గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఓటింగ్ నిర్వహించగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటు వేశారు.

తొలుత ఈ బిల్లును ప్రవేశపెట్టే యోగ్యత ప్రభుత్వానికి లేదంటూ విపక్షాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే, బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 మంది, వ్యతిరేకంగా 82 మంది ఓటేయడంతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కూటమిలో లేని టీడీపీ, వైసీపీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీలు మద్దతు పలకగా టీఆర్ఎస్, ఎంఐఎం  వ్యతిరేకించాయి.

More Telugu News