Nara Lokesh: లోకేశ్ తినే పప్పులో ఉల్లి పాయ గురించే చంద్రబాబు ఆలోచన: అసెంబ్లీలో రోజా తీవ్ర విమర్శలు

  • దిశ ఘటనతో మహిళలు తల్లడిల్లిపోయారు
  • ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించింది
  • మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ పడుతోంది
  • చర్చను అడ్డుకుంటున్న వారు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. 'దిశ ఘటనతో మహిళలు తల్లడిల్లిపోయారు. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించింది. ఏపీలో నిర్భయ, దిశల వంటి ఘటనలు జరగలేదు. మహిళల భద్రత కోసం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ పడుతోంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి, గతంలో ఆడవారిపై లోకేశ్, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి చర్చ వస్తుందేమోనని టీడీపీ భయపడుతోంది' అని రోజా అన్నారు.

'లోకేశ్ తినే పప్పులో ఉల్లి పాయ గురించే చంద్రబాబు ఆలోచన. చర్చను అడ్డుకుంటున్న వారు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? మహిళల పట్ల టీడీపీకి ఉన్న చిత్త శుద్ధి ఏంటో అర్థమవుతుంది.13 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడం కాదు. మహిళల్లో ధైర్యం నింపేలా చంద్రబాబు ప్రవర్తించాలి' అని రోజా అన్నారు.

'దిశ ఘటన తర్వాత ఆడపిల్లలు భయపడుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగితే దేశమంతా సంబరాలు జరిగాయి. మహిళల భద్రత కోసం ఇంకా ఏం చేయాలనే చర్చ జరుగుతోంది.  మహిళల పట్ల నేరాలకు శిక్షలు వేగంగా జరగాలని కోరుకుంటున్నాను. మహిళలపై ఘోరాలు జరగడానికి మద్యమే కారణం' అని అన్నారు.

'దిశ ఘటన జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం కనీసం దిశ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. కానీ, ఎన్ కౌంటర్ జరిగాక స్పందిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అరుస్తున్నారు. నేరస్థులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నారు' అని రోజా ఆవేశంగా అన్నారు.

More Telugu News