Hyderabad: సెల్ఫీకోసం గొడవ...బాగ్‌లింగంపల్లి పార్క్‌లో ఉద్రిక్తత

  • అమ్మాయిలతో ఫొటో కోసం అబ్బాయిల పట్టు
  • నిరాకరించిన బాలికలు
  • వివాదం కావడంతో అబ్బాయిలను చితకబాదిన అమ్మాయిల  తల్లిదండ్రులు

చిన్న వివాదం పెద్ద గొడవకు...ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులకు కారణమయింది. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లి చివరికి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరింది. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన బాగ్‌లింగంపల్లి పార్క్‌కు నల్లకుంట ప్రాంతానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతున్న తన స్నేహితురాలితో కలిసి నిన్న సాయంత్రం వచ్చింది. వారిద్దరూ ఆడుకుంటూ ఉండగా తొమ్మిదో తరగతి అమ్మాయితో పరిచయం ఉన్న ఇద్దరు అబ్బాయిలు వారి వద్దకు వచ్చారు. వారితో మాటలు కలిపారు. కాసేపయ్యాక సెల్ఫీ దిగుదామని చెప్పారు.

ఇందుకు అమ్మాయిలు సుముఖత వ్యక్తం చేయక పోవడంతో వచ్చిన అబ్బాయిలు ఇంటర్‌ చదువుతున్న అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగారు. దీంతో వివాదం మొదలయ్యింది. పార్క్‌లో జరుగుతున్న వ్యవహారాన్ని ఇంటర్‌ చదువుతున్న అమ్మాయికి తెలిసిన ప్రకాష్‌ అనే అబ్బాయి గుర్తించాడు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

వారు హుటాహుటిన వచ్చి పిల్లల్ని అల్లరి పెడుతున్నారని భావించిన ఆ ఇద్దరు యువకుల్ని చితక బాదడంతో వారు పారిపోయారు. ఈ క్రమంలో పార్క్‌లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత వివాదం ప్రకాష్‌, పార్క్‌ సమీపంలో నివసిస్తున్న కుమార్‌ అనే అతని మధ్య మొదలయ్యింది. దీంతో విషయం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

అక్కడ కూడా వీరిద్దరూ మళ్లీ గొడవ పడడంతో పోలీసులు వీరిద్దరితోపాటు పార్క్‌లో వ్యవహారానికి బాధ్యులైన యువతీయువకులు, అమ్మాయిల తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు.

More Telugu News