Kurnool District: ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో వివాహం.. ఊరేగింపు కోసం గుర్రమెక్కుతుంటే పట్టుకుని చావబాదిన గ్రామస్థులు!

  • నంద్యాలలో ఘటన
  • అమ్మాయి మెడలో తాళి కడుతుండగా అడ్డుకున్న బాధిత కుటుంబ సభ్యులు
  • ఇద్దరి నుంచీ భారీగా కట్నం తీసుకున్న ఘనుడు

ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని, మరో యువతిని పెళ్లాడేందుకు పెళ్లి పీటలు ఎక్కిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన మోహనకృష్ణ తిరుపతిలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. నంద్యాలకు చెందిన యువతితో అతడికి పెళ్లి కుదిరింది. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకునేందుకు మోహన్‌కృష్ణ గుర్రం ఎక్కుతున్నాడు. సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.

మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన కొందరు అక్కడికి చేరుకుని మోహనకృష్ణను పట్టుకుని చితకబాదారు. ఒకరితో నిశ్చితార్థం చేసుకుని మరొకరిని ఎలా పెళ్లాడతావని నిలదీశారు. కట్నకానుకలు తీసుకుని జాతకాలు కలవలేదని ముఖం చాటేయడమేంటని ప్రశ్నించారు. తీసుకున్న కట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకున్న నిందితుడు మండపానికి చేరుకుని పెళ్లి పీటలపై కూర్చున్నాడు. వధువు మెడలో తాళి కట్టబోతుండగా అతడిని వెతుక్కుంటూ వచ్చిన మక్తల్ వాసులు మరోమారు అతడిపై దాడిచేశారు.

వరుడు చేసిన మోసం గురించి తెలిసిన వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామిచ్చిన కట్నకానులు, ఖర్చులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, నిందితుడు మోహన్‌కృష్ణ ఇరు కుటుంబాల నుంచి కట్నకానుకల కింద రూ. 12 లక్షల వరకు డబ్బులు, 6 తులాల చొప్పున బంగారం తీసుకోవడం గమనార్హం.

More Telugu News