SKU: గుండెపోటుతో ఎస్కేయూ వైస్ చాన్స్‌లర్ జయరాజ్ హఠాన్మరణం

  • బస్సులోనే కుప్పకూలిన జయరాజ్
  • నిన్న సాయంత్రం అనంతపురంలో సన్మానం
  • విజయవాడ వెళ్తుండగా డోన్‌లో గుండెపోటు

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జయరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విజయవాడ వెళ్లేందుకు ఆదివారం రాత్రి అనంతపురంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన ఆయన, కర్నూలు జిల్లా డోన్ వద్ద గుండెపోటుతో బస్సులోనే కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆయనను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

1987లో ఎస్కేయూలో అధ్యాపకుడిగా చేరిన జయరాజ్ 2012లో రాష్ట్ర ఉత్తమ ఆచార్య అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది అక్టోబరు 26న వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మరణవార్త తెలిసి విద్యార్థులు, విద్యారంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం రాత్రి జయరాజ్ విజయవాడ బయలుదేరడానికి ముందు అనంతపురంలో బహుజన రచయితల సంఘం నిర్వహించిన అభినందన సభలో సన్మానం అందుకున్నారు.

More Telugu News