East Godavari District: రైతుల కోసం సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తా: పవన్ కల్యాణ్

  • రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • వచ్చే మూడు రోజుల్లో జగన్ స్పందించాలి  
  • లేనిపక్షంలో ఈ నెల 12 కాకినాడలో నిరాహారదీక్ష చేస్తా

రైతుల కోసం సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకోకపోతే కాకినాడలో నిరాహారదీక్ష చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే మూడు రోజుల్లో స్పందించకపోతే కనుక ఈ నెల 12 కాకినాడలో నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. రైతు సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

రైతుల దగ్గర నుంచి ధాన్యం విక్రయించి నలభై ఐదు రోజులు గడుస్తున్నా వారికి డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమని పవన్ మండిపడ్డారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదులు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. రైతులు తమ రక్తం ధారపోస్తే పంటకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని మండిపడ్డారు. రైతు బిడ్డగా అన్నదాతల కష్టాలు తనకు తెలుసని అన్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచుతారు కానీ, రైతు కష్టాలు తీర్చేందుకు ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదని విమర్శించారు. ఈ  సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన విరుచుకుపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలు పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News