East Godavari District: రైతులను జగన్ ప్రభుత్వం బెదిరిస్తోంది: జనసేన ఎమ్మెల్యే రాపాక ఆరోపణ

  • రైతు సమస్యలపై స్పందించట్లేదు
  • జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపిన నాయకుడు పవన్  
  •  రైతు పంటకు గిట్టుబాటు ధర కూడా దక్కట్లేదు

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. మండపేటలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు తమ సమస్యలను పవన్ కల్యాణ్ ముందు ఏకరవుపెట్టారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ, రైతులను జగన్ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. రైతు సమస్యలపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపిన నాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు. రైతు పండించిన పంట లాభసాటి ధర సంగతి అలా వుంచితే, అసలు, గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతు సమస్యలు ఒక మండలానికో, జిల్లాకో సంబంధించింది కాదని, యావత్తు రాష్ట్ర రైతులకు సంబంధించిందని అన్నారు. రైతు సమస్యలను పవన్ కూలంకషంగా తెలుసుకుంటున్నారని, రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం దిగి రావాలని అన్నారు.

More Telugu News