onion: చికెన్ షాపులో నుంచి 40 కిలోల ఉల్లిపాయల చోరీ!

  • చండీగఢ్‌లోని మొహాలీలో ఘటన
  • ఉల్లిని తప్ప మరో వస్తువును ముట్టని దొంగలు
  • పోలీసులకు ఫిర్యాదు

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఉల్లిపాయల ధరపైనే చర్చ జరుగుతోంది. రోజురోజుకు పెరుగుతూ పోతున్న ఉల్లిధర కిలోకు రూ.200కు పైగా పలుకుతోంది. దీంతో ప్రజలు ఉల్లి కొనలేక, ఉండలేక అల్లాడిపోతున్నారు. దీంతో దిగొస్తున్న ప్రభుత్వాలు రాయితీపై ప్రజలకు ఉల్లిపాయలు అందిస్తూ కొంత వరకు ఊరట కల్పిస్తున్నాయి. మరోవైపు, వ్యాపారులను ఉల్లిచోరులు కంగారు పెడుతున్నారు. ఇటీవల ఇటువంటి చోరీలు ఒక్కసారిగా పెరిగాయి.

తాజాగా చండీగఢ్‌లోని మొహాలీలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. ఫేజ్-7లోని ఓ చికెన్ షాపులో నిల్వ ఉంచిన రూ.40 కిలోల ఉల్లిపాయలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో దుకాణం యజమాని రాజిందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణంలో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా ఉల్లిపాయలను మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి విలువ రూ.3 వేల వరకు ఉంటుందన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News