Tamil Nadu: లైంగికంగా వేధిస్తున్న సోదరుడిని నరికి చంపిన వివాహిత!

  • తమిళనాడులోని ఉత్తమపాళయంలో ఘటన
  • బావమరిది భార్యకే వేధింపులు
  • భర్తతో కలిసి వెళ్లి హతమార్చిన భార్య

లైంగికంగా వేధిస్తున్న వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని హతమార్చిందో వివాహిత. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తమిళనాడులోని తేని జిల్లా ఉత్తమపాళయంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మణికంఠన్ (38) అరటి ఆకుల వ్యాపారం చేస్తుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి బావమరిది పాండీశ్వరన్ (30)కు భార్య నిరంజన (25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణికంఠన్, పాండీశ్వరన్‌లు కలిసి కొన్నాళ్లపాటు టీ కొట్టు నడిపారు. ఆ సమయంలో వరుసకు సోదరి అయ్యే నిరంజనపై మణికంఠన్ కన్ను పడింది. ఆమెను లొంగదీసుకునేందుకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా అతడి వైఖరిలో మార్పు రాలేదు.

ఇక లాభం లేదని భావించిన నిరంజన విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మణికంఠన్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో టీ కొట్టును మూసేసి ఇద్దరూ వేర్వేరు వ్యాపారాలు పెట్టుకున్నారు. విడిపోయినా బుద్ధిమార్చుకోని మణికంఠన్.. బావమరిది భార్యకు ఫోన్ చేసి లైంగికంగా వేధించడం మానలేదు. దీంతో విసిగిపోయిన నిరంజన నిన్న ఉదయం భర్తతో కలిసి మణికంఠన్‌ వద్దకు వెళ్లి ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించింది. దీంతో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. అది మరింత ముదరడంతో నిరంజన తన వెంట తెచ్చుకున్న కొడవలితో మణికంఠన్‌పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన మణికంఠను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరోవైపు, మణికంఠన్‌పై దాడిచేసిన నిరంజన దంపతులు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News