Andhra Pradesh: అభివృద్ధి చేతకాకపోతే చెప్పండి... మేం చేసి చూపిస్తాం: వైసీపీ ప్రభుత్వంపై కేశినేని నాని ధ్వజం

  • విధ్వంసాల ప్రభుత్వం అంటూ మండిపాటు
  • సొంత పనుల కోసం ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తున్నారని ఆరోపణ
  • అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లారా? అంటూ విమర్శలు

ఏపీ అధికార పక్షం వైసీపీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. అభివృద్ధికి బదులుగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే చెప్పండి, మేం చేసి చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఢిల్లీ వెళ్లింది ఎందుకు... అభివృద్ధి కోసమేనా? లేక సొంత పనుల నిమిత్తం అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. స్వకార్యాల కోసం ప్రభుత్వం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని నాని ఆరోపించారు.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరైన కేశినేని నాని ఇటీవల జరిగిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్య విషయాన్ని లోక్ సభలో లేవనెత్తారు. దీనికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బదులిస్తూ, ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించి దర్యాప్తు షురూ చేసిందని లిఖితపూర్వకంగా తెలియజేశారు. అంతేకాకుండా, మరణించిన జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టు సంక్షేమ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News