Anantapur District: కట్టుకున్న భార్యపై భర్త అమానుషం.. ఇస్త్రీపెట్టెతో వాతలు!

  • అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఘటన
  • తలుపులు వేసి ఇస్త్రీపెట్టతో శరీరంపై వాతలు
  • బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు

కట్టుకున్న భార్యపై కిరాతకానికి పాల్పడ్డాడో భర్త. విచక్షణ రహితంగా కొట్టి ఇస్త్రీపెట్టతో వాతలు పెట్టాడు. అనంతపురం జిల్లా కదిరి మండలంలో జరిగిందీ ఘటన. బాధితురాలి కథనం ప్రకారం.. ఓరువాయికి చెందిన రేణుక, కడప జిల్లా రాయచోటి సమీపంలోని చీకటివాండ్లపల్లికి చెందిన చంద్ర భార్యభర్తలు. ఇటీవల మద్యానికి బానిసైన చంద్ర.. భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తరచూ గొడవపడడం, విచక్షణ రహితంగా కొట్టడం చేస్తుండడంతో అతడి బాధ భరించలేని రేణుక నెల రోజుల క్రితం మదనపల్లెలో ఉండే సోదరుడి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.

అయితే, ఆధార్ కార్డులు అవసరం కావడంతో వారం రోజుల క్రితం తిరిగి భర్త వద్దకు వెళ్లింది. నాలుగు రోజులపాటు బాగానే ఉన్న భర్త బుధవారం రాత్రి మరోమారు చెలరేగిపోయాడు. మద్యం తాగివచ్చి భార్యను చితక్కొట్టాడు. అక్కడితో ఆగక.. చెప్పకుండా ఇంటికి ఎందుకు వెళ్లావంటూ తలుపులు వేసి ఇస్త్రీపెట్టెతో వాతలు పెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రేణుక జరిగిన విషయాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌బాను బాధితురాలిని పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

More Telugu News