India: తేలిపోయిన టీమిండియా బౌలర్లు, ఫీల్డర్లు... ఉతికారేసిన విండీస్ బ్యాట్స్ మెన్

  • ఉప్పల్ మ్యాచ్ లో విండీస్ స్కోరు 5 వికెట్లకు 207 రన్స్
  • క్యాచ్ లు వదిలేసిన టీమిండియా
  • రెచ్చిపోయిన హెట్మెయర్, పొలార్డ్, లూయిస్

ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. అటు పేలవ ప్రదర్శనతో ఫీల్డర్లు అనేక క్యాచ్ లు డ్రాప్ చేయగా, ప్రత్యర్థి తప్పిదాలను సొమ్ము చేసుకున్న విండీస్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు.

 బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేశారు. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (2) మినహా మిగతా అందరూ రెండంకెల స్కోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ 17 బంతుల్లో 40 పరుగులు చేయగా, కొత్త కుర్రాడు బ్రాండన్ కింగ్  23 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.

దీపక్ చహర్ తొలి వికెట్ తీసి ఉత్సాహం నింపినా, ఆ తర్వాత తేలిపోయాడు. షిమ్రోన్ హెట్మెయర్ (56), పొలార్డ్ (19 బంతుల్లో 37) చహర్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. చివర్లో వచ్చిన మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ సైతం బ్యాట్ ఝుళిపించడంతో విండీస్ స్కోరు 200 మార్కు దాటింది. హోల్డర్ 9 బంతుల్లోనే 24 పరుగులు సాధించాడు.

More Telugu News