warangal: మా బిడ్డను చంపిందీ నలుగురే...వారి సంగతి చూడండి : వరంగల్ యువతి తల్లిదండ్రులు

  • పుట్టిన రోజున గుడికని చెప్పి పార్టీకి వెళ్లిన యువతి హత్య 
  • ప్రియుడే ఇంటి నుంచి తీసుకువెళ్లి అఘాయిత్యం 
  • నిందితుడు ఒక్కడే కాదంటున్న బాధితులు

దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు తమ బిడ్డను చంపిన వారికీ అదే శిక్ష విధించాలని వరంగల్ లో ఇటీవల హత్యాచారానికి గురైన యువతి కుటుంబం కోరుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దిశ తల్లిదండ్రులకు పోలీసులు న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేస్తూ, తమ కుమార్తెకు అలాగే న్యాయం చేయాలని కోరారు. 


తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నది ఒక్కడు కాదని, నలుగురని, వారి సంగతి కూడా చూడాలని కోరారు. వరంగల్ పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి తన పుట్టిన రోజు కావడంతో గత నెల 27న బుధవారం స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లింది. మరునాడు ఉదయం సమీపంలోని ప్రాంతంలో శవమై కనిపించింది. ఆమెపై ఎవరో అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు గుర్తించారు.

తర్వాత ప్రియుడే ఆమెను తెలివిగా ట్రాప్ చేసి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. తాజాగా బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం నిందితుడు ఒక్కడు కాదని, అతనితోపాటు మరో ముగ్గురు ఉన్నారని, అందరూ కలిసే తమ కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టారని చెబుతున్నారు. తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి చంపారని, వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని కోరారు.

More Telugu News